లీడర్ భాస్కర్ న్యూస్ (ఉండి) యానాదులు కాలనీలో రోడ్డు పక్కన సుమారు 40 సంవత్సరాల క్రితం ఇళ్ళు వేసుకుని నివాసముంటున్న ఎస్టీ యానాదులకు చెందిన కె.మావుళ్ళమ్మ,కంది సీతమ్మల ఇళ్ళను తొలగించాలని దౌర్జన్యానికి పాల్పడుతున్న ఇర్రింక సూర్యనారాయణపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుని యానాది మహిళలకు న్యాయం చేయాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు.సోమవారం యానాదుల ఇళ్ళను తొలగించాలని దౌర్జన్యానికి ఒడిగడుతున్న ఇర్రింకి సూర్యనారాయణపై చర్యలు కోరుతూ సీపీఐ ఉండి మండల సమితి ఆధ్వర్యంలో ఉండి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కు అందజేశారు.అనంతరం ర్యాలీగా వెళ్లి పంచాయతీ అధికారులకు, పోలీసు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.ఈసందర్భంగా భీమారావు, సీపీఐ ఉండి ఏరియా కార్యదర్శి కలిశెట్టి వెంకట్రావు మాట్లాడుతూ యానాదులను అక్రమంగా తొలగించి ఆస్ధలాలను ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతోనే ఇర్రింకి సూర్యనారాయణ యానాదులపై దౌర్జన్యానికి ఒడిగడుతున్నాడన్నారు.ఇర్రింకి సూర్యనారాయణ ఇప్పటికే పంట బోదె పూడ్చివేసి కొబ్బరి మొక్కలు నాటడం జరిగిందన్నారు.యానాదుల ఇళ్ళను పూర్తిగా తొలగింప చేసి ఆ స్థలాలను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనే దురుద్దేశంతో యానాది మహిళలను కులం పేరుతో దూషిస్తూ అసభ్యకరమైన పదజాలంతో బూతులు తిడుతూ అనుచితంగా ప్రవర్తిస్తూ ఎస్టీ మహిళలను అవమానపరుస్తున్నాడన్నారు.ఎస్టీ మహిళలను కులం పేరుతో దూషిస్తూ అసభ్యకరమైన పదజాలంతో బూతులు తిడుతూ దౌర్జన్యానికి ఒడిగడుతున్న ఇర్రింకి సూర్యనారాయణ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యానాది మహిళలకు రక్షణ కల్పించి తగు న్యాయం చేయాలని కోరారు.