లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు)తణుకు నియోజకవర్గంలో గుంతల రహిత రోడ్లను నిర్మిస్తామని తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో మిషన్ పాట్ హోల్ ఫ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గంలో దాదాపు 13 వర్కులకు గాను రూ. 2 కోట్ల రూపాయల వ్యయంతో అన్ని గ్రామాలలో రిపేర్లు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. దానిలో భాగంగా తణుకు మండలం దువ్వ గ్రామంలో రూ. 10 లక్షల రూపాయల వ్యయంతో దువ్వ – సూర్యారావుపాలెం R&B రోడ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో గుంతల రహదారుల్లో ప్రయాణాలు సాగించలేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. అప్పటి ప్రభుత్వం రోడ్లపై గుంతలను పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు “మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఆంధ్ర ప్రదేశ్” కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని రహదారులు గుంతలుగా లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 8,000 కిలోమీటర్ల రోడ్డులో 290 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్డు మరమ్మత్తు పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. రెండవ దశలో 8,000 కిలోమీటర్ల రోడ్డులో 350 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్డు మరమ్మత్తు పనులు కూడా చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంలో గుంతల రహిత రోడ్లను నిర్మిస్తాం – తణుకు ఎంఎల్ఏ ఆరిమిల్లి రాధాకృష్ణ…
02
Nov