జీవితంలో యోగాను అంతర్భాగం చేసుకోవాలి – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
లీడర్ న్యూస్ (తణుకు) తణుకు జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో, యోగాంద్ర 2025 కార్యక్రమం కింద గురువారం జరిగిన “యోగాసనాలు” కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “యోగాంద్ర 2025” ప్రధాన లక్ష్యం ప్రజల్లో యోగాభ్యాసంపై అవగాహన పెంపొందించడం మరియు ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితం గడపడంలో భాగస్వాములవ్వడమే అని తెలిపారు. ప్రతిరోజూ యోగ సాధన చేయడం ద్వారా శరీరానికి ఆరోగ్యంతో పాటు మనస్సుకు ఉల్లాసం కలుగుతుందని, అందుకే యోగాన్ని మన జీవనశైలిలో ఒక భాగంగా మార్చుకోవాలని సూచించారు. విద్యార్థులు యోగ సాధన ద్వారా శారీరకంగా ఫిట్గా, ఉత్తేజంగా ఉండగలరని పేర్కొన్నారు.
ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ సుమారు 5 లక్షల మంది యోగా అభ్యాసకులతో కలిసి పాల్గొననున్నారని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
తణుకులోని ప్రజలందరూ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి ముందుకు రావాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు.