గూగుల్‌ అడుగుతో విశాఖలో టెక్‌ విప్లవం…ఇకపై డిజిటల్‌ ఇండియాకు మార్గదర్శిగా ఏపీ… – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హర్షం వ్యక్తం…

లీడర్ న్యూస్ (తణుకు) విశాఖపట్టణంలో గూగుల్‌ సంస్థ రూ. 87,500 కోట్లు పెట్టుబడితో దక్షిణ ఆసియా ఖండంలోనే అతి పెద్ద డేటా సెంటర్‌ క్లస్టర్‌ నిర్మించడానికి ముందుకు రావడం టెక్‌ విప్లవానికి నాంది అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఇప్పటి వరకు సిటీ ఆఫ్‌ డెస్టినిగా ఉన్న విశాఖ నగరం ఇకపై ఏఐ, డిజిటల్‌ సిటీ రాజధానిగా మారనుందని చెప్పారు. దీంతో డిజిటల్‌ ఇండియాలో ఆంధ్రప్రదేశ్‌ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందనడానికి ఎలాంటి సందేహం లేదన్నారు. సాంకేతిక రంగం ఒక రాష్ట్ర భవిష్యత్తును ఎలా మార్చగలదో హైదరాబాదు ఒక ముఖ్య ఉదాహరణ అన్నారు. చంద్రబాబునాయుడు దూరదృష్టితో, మైక్రోసాఫ్ట్‌ సంస్థను హైదరాబాదుకు తీసుకురావడంతో హైదరాబాదు అభివృద్ధికి ఒక గేమ్‌ చేంజర్‌గా మారి రాష్ట్ర ఆర్థిక రూపురేఖలు మారిపోయినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ల ఆర్థిక దూరదృష్టితో పారదర్శక విధానాలతోపాటు మానవ వనరులు అందుబాటులో ఉండటంతో రాష్ట్రానికి టెక్‌ దిగ్గజాలు వస్తున్నాయని చెప్పారు. గూగుల్‌ రాకతో మరెన్నో ఐటీ, టెక్, ఏఐ కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టనున్నాయని ఆయన ఆశాబభావం వ్యక్తం చేశారు. గూగుల్‌ వంటి కంపెనీ రావడం అంటే మన పిల్లలకు ప్రపంచ స్థాయి అవకాశాలు వస్తున్నట్లే అన్నారు. రాష్ట్రంలో యువతకు ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌ పని చేస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *