• కాకినాడ జిల్లా పరిధిలో పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు పకడ్బందీగా రూపొందించండి
• తీర ప్రాంత గ్రామాల రక్షణపై బృహత్ ప్రణాళిక
• పంట నష్టపోయిన ప్రతి రైతుకీ న్యాయం జరగాలి
• పిఠాపురం నియోజక వర్గంలో పరిస్థితిపై ఆరా
• ఏలేరు కాలువ గట్టు పటిష్టతకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు
• మల్లవరం పత్తి రైతులకు న్యాయం చేయాలి
• కాకినాడ జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీడియో కాన్ఫరెన్స్
• తుపాను అనంతర ఉపశమన చర్యలపై దిశానిర్దేశం
లీడర్ న్యూస్ (మంగళగిరి) కాకినాడ జిల్లా పరిధిలో మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ స్వాంతన కలిగించి, న్యాయం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా అధికారులను ఆదేశించారు. పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు పకడ్బందీగా రూపొందించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ప్రకటించిన సాయం నష్టపోయిన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంత గ్రామాల్లో పారిశుధ్యం, తాగు నీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. సముద్రానికి ఆనుకుని ఉన్న మత్స్యకార గ్రామాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని ఆదేశించారు. శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఆర్ఓ, ఆర్డీవోలు, పడా ప్రాజెక్ట్ డైరెక్టర్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, వ్యవసాయ, విద్యుత్ శాఖలతోపాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుపాను అనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిధిలో మొంథా తుపాను ప్రభావంతో జరిగిన నష్టం వివరాలపై ఆరా తీశారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తుపాను అనంతరం తీసుకుంటున్న ఉపశమన చర్యలు, ఆస్తి, పంట నష్టం అంచనాలపై దిశా నిర్దేశం చేశారు.