లీడర్ న్యూస్ (తణుకు) రాష్ట్రంలో స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం తేతలి గ్రామ శివారు కొండాయపాలెం గ్రామంలో శనివారం స్వచ్ఛ రథాలను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్రంలో స్వర్ణ గ్రామాలు, స్వర్ణ పట్టణాలుగా చేయాలని సంకల్పంతో అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచంద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం పెంపొందించే విధంగా చర్యలు చేపట్టారని చెప్పారు. వివిధ దశల్లో స్వచ్ఛతను కాపాడే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రారంభించిందని పేర్కొన్నారు. గ్రామాల్లో స్వచ్ఛతను కాపాడేందుకు మండలానికి ఒక స్వచ్ఛ రథం కేటాయించినట్లు చెప్పారు. నివాసాల్లో నిరుపయోగంగా ఉన్న పనికిరాని వస్తువులను స్వచ్ఛ రథానికి ఇస్తే తిరిగి నిత్యవసరాలు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నారని తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించినట్లు తెలిపారు. స్వచ్ఛ రథాల ద్వారా ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించి గ్రామాల్లో పరిశుద్ధాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ప్రజల సహకారంతో తడి చెత్త పొడి చెత్తను సేకరించి పారిశుద్ధ్యన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
01
Mar