తొలి కార్మిక సంఘం ఏఐటీయూసీ ఉద్యమ పోరాటాల ఫలితమే దేశంలో కార్మిక చట్టాలు – కొనాల భీమారావు

లీడర్ న్యూస్ (తణుకు) దేశంలో తొలి కేంద్ర కార్మిక సంఘంగా 1920 అక్టోబర్ 31 న బొంబాయి నగరంలో ఆవిర్భవించిన ఏఐటీయూసీ నిర్విరామంగా నిర్వహించిన కార్మికోద్యమాలు,పోరాటాల ఫలితంగానే కార్మిక హక్కులు,చట్టాలు సాధించుకోవడం జరిగిందని ఏఐటీయూసీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు అన్నారు. ఏఐటీయూసీ 106 వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా శుక్రవారం తణుకులో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏఐటీయూసీ పతాకాలను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.ఈసందర్బంగా భీమారావు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలోనే దేశ స్వాతంత్ర సముపార్జన ఎంత ముఖ్యమో కార్మికులను కట్టుబానిసత్వం నుంచి విముక్తి చేయడం కూడా అంతే ముఖ్యంగా భావించి ఆనాటి స్వాతంత్రోద్యమ నాయకులు లాలాలజపతిరాయ్, చిత్తరంజన్ దాస్,మోతీలాల్ నెహ్రూ,బాలగంగాధరతిలక్ లాంటి యోధానుయోధులు ఏఐటీయూసీ ఆవిర్భావానికి పూనుకున్నారన్నారు.అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న 36 కార్మిక చట్టాలను నేటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి కార్మికులను తిరిగి కట్టుబానిసలను చేస్తూ కార్పోరేట్, బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్ లు తేవడం జరిగిందన్నారు. ఏఐటీయూసీ 106 సంవత్సరాల ఉద్యమ పోరాట స్ఫూర్తితో కార్మిక చట్టాల పునరుద్దరణకు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దుకు సంఘటిత ఉద్యమాలకు కార్మికులు సమాయత్తం కావాలని భీమారావు పిలుపునిచ్చారు.  స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ శ్రీసత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ శ్రీ అక్కమాంబ టెక్స్ టైల్స్, ఏపీ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్, ఏపీ సీడ్స్ మహిళా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కార్మిక నాయకులు అట్రు వెంకట్రావు,దాకే ముసలయ్య,దేవ పెద్దిరాజు,చిక్కాల దుర్గాప్రసాద్, ధర్మాని పుష్పలత,సావారపు దేవీ తదితరులు నాయకత్వం వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *