•దేశంలోనే మొదటిసారి భారీ స్థాయిలో ఒకే రోజు గ్రామ సభల నిర్వహణ
•ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4,500 కోట్ల నిధులతో, 87 రకాల పనులకు ఆమోదం
•9 కోట్ల పని దినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన
•స్వయంసమృద్ధితో పంచాయతీలు కళకళలాడాలి
• గ్రామాలకు ఆదాయం, అభివృద్ధి పెంచేలా ప్రణాళిక
• పంచాయతీల పునరుజ్జీవానికి నలుదిశలా విప్లవం
• గ్రామ ప్రత్యేకతలకు బ్రాండ్ రావాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం
• సోషల్ ఆడిట్ పకడ్బందీగా చేపడతాము
• విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్
లీడర్ భాస్కర్ న్యూస్ (మంగళగిరి) ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామని మాటిచ్చాం. దాని ప్రకారమే పంచాయతీలు సుసంపన్నం కావాలనే సుదూర లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తున్నామ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలను నిర్వహించి, గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రజలంతా కలిసి తీర్మానాలు చేయనున్నారని తెలియజేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా రూ.4,500 కోట్ల నిధులతో, 87 రకాల పనులను గ్రామాల్లో చేయనున్నామన్నారు. దీనిద్వారా మొత్తం 9 కోట్ల పనిదినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించే బృహత్తర ప్రణాళిక అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన దేశంలో ఎన్నడూ లేనట్లుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామాల్లో చేయాల్సిన పనులపై చర్చిచేందుకు మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలను నిర్వహిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గురువారం మంగళగిరిలోని ఆయన ప్రైవేట్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.