లీడర్ భాస్కర్ న్యూస్ (భీమవరం)అధ్వాన్న స్థితికి చేరుకున్న కైకలూరు, నాగిడిపాలెం, గణపవరం, తణుకు నుంచి జిల్లా కేంద్రం భీమవరం చేరుకునే రోడ్ల నిర్మాణం తక్షణమే చేపట్టాలని కోరుతూ ఈ నెల 22, 23వ తేదీల్లో భీమవరంలో సిపిఐ చేపట్టిన 32 గంటల నిరసన దీక్షలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన భీమవరంలో ఒక ప్రకటన విడుదల చేసి మాట్లాడుతూ ఈ దీక్షలను 22వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రకాశంచౌక్ సెంటర్లో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు ప్రారంభిస్తారని, 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ దీక్షలను విరమింపచేస్తారని తెలిపారు. గత ఐదేళ్ళ వైసీపీ పాలనలో రోడ్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురయి ప్రమాదాలకు నిలయాలుగా మారాయన్నారు. రోడ్లపై ప్రయాణం అత్యంత కష్టతరంగా,ప్రమాదకరంగా మారిందన్నారు.రోడ్లపై ఏర్పడిన పెద్ద పెద్ద గోతుల్లో వాహనాలు పడి వాహనదారులు తీవ్ర ప్రమాదాలకు గురై తీవ్ర అంగ వైకల్యానికి గురవుతున్న సంఘటనలు నిత్యకృత్యంగా మారాయని కోనాల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి గత వైసీపీ పాలన నిర్లక్ష్య ఫలితమే నన్నారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించి తక్షణమే రోడ్ల నిర్మాణం చేపట్టి వాహనదారుల, ప్రజల కష్టాలను పరిష్కరించాలని కోరారు.అధ్వాన్న స్థితికి చేరుకున్న రోడ్ల నిర్మాణం కోరుతూ సీపీఐ చేపట్టిన 32 గంటల నిరసన దీక్షలను జయప్రదం చేయాలని కోనాల కోరారు.
22,23 తేదీల్లో భీమవరంలో సీపీఐ 32 గంటల నిరసన దీక్షలు జయప్రదం చేయాలి – సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు…
19
Oct