— కాకినాడలోని యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రై.లి. వ్యవహారంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు…
లీడర్ న్యూస్ (మంగళగిరి) కాకినాడ వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి కాలుష్యకారక దుర్గంధం వెలువడడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా సంస్థ నుంచి ఘాటైన, దుర్గంధపూరిత వాయువులు విడుదల విషయంపై ఉప ముఖ్యమంత్రి పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ కృష్ణయ్య, పీసీబీ కాకినాడ రీజనల్ ఆఫీసర్ శంకరరావుతో ఫోన్లో మాట్లాడారు. యూనివర్సల్ బయోఫ్యూయల్స్ సంస్థ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తుందో? లేదో? పరిశీలించి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు వాయు కాలుష్య సమస్యలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పరిశీలన చేపట్టారు నిబంధనలకు విరుద్ధంగా ముడి పదార్థాలు వాడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఫలితంగా ఘాటైన, దుర్గంధపూరిత వాయువులు వెలువడుతున్నాయని తేలింది. దీనిపై మరింత లోతుగా తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు తెలియచేశారు.