లీడర్ న్యూస్ (తణుకు) స్వేచ్ఛ, సమానత్వం, శ్రమదోపిడీ, 8గంటల పనిదినం, ఓటు హక్కు సాధన, లింగ వివక్షత, లకు వ్యతిరేకంగా శ్రామిక మహిళలు, కమ్యూనిస్టు, సోషలిస్టు మహిళలు ప్రపంచవ్యాపితంగా సాగించిన పోరాటాల ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని పలువురు వక్తలు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా శనివారం తణుకు వంక సత్యనారాయణ సురాజ్య భవన్ నందు భారత జాతీయ మహిళా సమాఖ్య(ఎన్ఎఫ్ఐడబ్ల్యు)ఆధ్వర్యంలో గౌరవప్రదమైన జీవితం దాతృత్వం కాదు ఇది మహిళల హక్కు అందుకై పోరాడుదాం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షురాలు సావారపు దేవీ సదస్సుకు అధ్యక్షత వహించారు. ఈసదస్సులో రిటైర్డ్ జిల్లా జడ్జి అడబాల లక్ష్మి,డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రన్సిపాల్ ఎస్. మనోరమ, ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ వంక వసుంధర,మహిళా ఉద్యమ నాయకురాలు వావిలాల సరళాదేవి, రిటైర్డ్ లెక్చరర్ భూపతిరాజు ఝాన్సీ, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి, రాష్ట్ర సమితి సభ్యురాలు వై. నాగలక్ష్మి లు మాట్లాడుతూ మహిళలు లేనిదే సమాజ మనుగడ లేదని మహిళలకు సమున్నత అవకాశాలు ప్రభుత్వాలు వేసే బిక్ష కాదు హక్కని పేర్కొన్నారు. మహిళా సాధికారత లక్ష్యగా చెపుతున్న ప్రభుత్వాలు ఆచరణలో వివక్షత చూపుతున్నాయన్నారు. మహిళలు ఉన్నత విద్యకు నోచుకోకపోవడం, రక్తహీనతతో బాలింతలు కన్నుమూయడం,పసికందు నుంచి ఎనభై ఏళ్ళ వృధ్ధులు సైతం అత్యాచారాలు, హత్యలకు గురికావడం లాంటి ఘటనలు చోటుచేసుకోడం ప్రభుత్వాలు సిగ్గు పడాలన్నారు. మహిళల సంక్షేమానికి ఇస్తున్న పథకాలు ప్రభుత్వాల దాతృత్వం కాదని అది వారి హక్కని పునరుద్ఘాటించారు.మహిళలు అణచివేతకు వ్యతిరేకంగా స్వేచ్ఛ, సమానత్వం లక్ష్యంగా సంఘటిత పోరాటాలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు,మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి వలవల అరుణ కుమారి, తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎన్.నాగలక్ష్మి,వడ్డాది మేరీ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం శ్రామిక మహిళలు సావారపు దేవీ, ధర్మాని పుష్పలత, మహిళా నాయకురాలు వావిలాల సరళాదేవి,డాక్టర్ వంక వసుంధర, రిటైర్డ్ జడ్జి అడబాల లక్ష్మి, యస్. మనోరమ, భూపతిరాజు ఝాన్సీ సికిలే పుష్పకుమారి, వై. నాగలక్ష్మి లను దశ్శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.