లీడర్ న్యూస్ (తణుకు) సామాజిక కట్టుబాట్లు,సంస్కృతి, సాంప్రదాయాలు పేరుతో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా ప్రాణాలను ఫణంగా పెట్టి మహిళల అభ్యున్నతికి పోరాడిన భారతీయ సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే జీవితం నేటి తరాలకు ఆదర్శం కావాలని ఏపీ మహిళా సమాఖ్య(ఎన్ఎఫ్ఐడబ్ల్యు)పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి అన్నారు. సామాజిక ఉద్యమ కారిణి సావిత్రి బాయి పూలే 128 వ వర్ధంతి సందర్బంగా సోమవారం తణుకు చెల్లమాంబ రెసిడెన్సీ నందు ఎన్ఎఫ్ఐడబ్ల్యు ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈసందర్బంగా పుష్పకుమారి మాట్లాడుతూ కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి,పురుషాధిక్య ధోరణులకు వ్యతిరేకంగా మహిళల హక్కుల సాధనకు,నూతన వ్యవస్థ కోసం పోరాడిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రి బాయి పూలే అన్నారు. ఆధునిక విద్య ద్వారానే సమాజం బాగుంటుందని భావించి తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి 1848 లోనే పూణేలో మొట్ట మొదటిగా బాలికల పాఠశాల ప్రారంభించి మహిళా విద్యకు పూనుకున్నారన్నారు. శూద్రులు, అస్పృశ్యులు, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేసిన పూలే దంపతులు ఉద్యమ స్ఫూర్తితో సామాజిక అసమానతలు, అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పుష్పకుమారి కోరారు.
ఎన్ఎఫ్ఐడబ్యు తణుకు ఏరియా అధ్యక్షురాలు సావారపు దేవీ,కార్యదర్శి వలవల అరుణకుమారి, పట్టపు కృష్ణవేణి, కవల మంగతాయారు, లక్కోజు రాజ్యలక్ష్మి తదితరులు సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.