లీడర్ న్యూస్ (తణుకు) ప్రస్తుతం ఆహారపు అలవాట్లు కారణంగా క్యాన్సర్ విస్తరిస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి ప్రతి ఒక్కరు క్యాన్సర్ స్క్రీనింగ్ పై అవగాహన పెంచుకోవాలని ఆయన కోరారు. తణుకు వీకే కన్వెన్షన్ హాల్ లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మెగా ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. రోటరీ క్లబ్ అధ్యక్షులుగా కలగర వెంకటకృష్ణ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైద్య పరంగా ఎన్నో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారని అభినందించారు. మహిళల్లో క్యాన్సర్ పెరుగుతున్న నేపద్యంలో వారిలో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ తో పాటు గర్భాశయ క్యాన్సర్ పెరుగుతున్న క్రమంలో ముందుగా స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ పై విజయం సాధించవచ్చని అన్నారు. వైద్య శిబిరాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రాధాన్యత ఇచ్చి దీనిపై అవగాహన పెంచే విధంగా వైద్యులు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో మహిళల ఆరోగ్య భద్రత కోసం మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేసే విధంగా నిర్వాహకుల కృషి చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ నాయకులతోపాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
క్యాన్సర్ నివారణపై అవగాహన తీసుకురావాలి – ఎమ్మెల్యే రాధాకృష్ణ
11
Oct