జగన్ చెత్త పుత్రుడు : ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

లీడర్ న్యూస్ (తాడేపల్లిగూడెం) రాజకీయ మర్యాదలు పాటించడం చేతగాని అరాచకవాది జగన్ ఒక చెత్త పుత్రుడని, అమరావతికి అడ్డుపడే అభివృద్ధి నిరోధకుడని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అభిమానులు ఆరాధ్య దైవంగా భావించే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు అంటూ పదేపదే సంబోధించడం అతని మనస్తత్వం ఎలాంటిదో తెలియజేస్తుందని అన్నారు. స్థానిక శాసనసభ్యుని విడిది కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ తీరు మారకపోతే ఇకనుంచి అతనిని చెత్త పుత్రుడు అని పిలుస్తామని అన్నారు. జగన్ పుట్టినరోజుకు పవన్ శుభాకాంక్షలు తెలియజేశారని జగన్ కు అలాంటి సంస్కారం లేదని అన్నారు. రాజకీయాలలో గెలుపు, ఓటమి సహజమని, పరస్పరం గౌరవించుకోవడం అనేది ముఖ్యమన్నారు. ఇకనుంచైనా జగన్ అసూయతో విషం కక్కటం మానాలని, సంస్కారవంతమైన భాష మాట్లాడాలని అన్నారు. విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తామంటూ ప్రగల్బాలు పలికిన జగన్ ను రాష్ట్ర ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని అన్నారు. ఇప్పుడు మళ్ళీ మేమే వచ్చేస్తాము అంటూ ఉత్తర కుమారుడి లాగా ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు 40వేల కోట్ల అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లిన వ్యక్తి, తాను అధికారం చేపట్టి రాష్ట్ర ఖజానాను దోపిడీ చేశారని విమర్శించారు.రాష్ట్ర నిధులే కాకుండా కేంద్రం నుంచి వచ్చే 15 వ ఫైనాన్స్ తదితర నిధులను కూడా దుర్వినియోగం చేశారని అన్నారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు మనశ్శాంతి లేకుండా చేసిన చెత్త పుత్రుడు జగన్, వైయస్ పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను దగా చేశారన్నారు . సంక్షేమం పేరుతో వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారన్నారు. కన్నతల్లిని,తోడబుట్టిన చెల్లిని కూడా మోసం చేసి బయటకు వెళ్లగొట్టిన ఘనుడు జగన్ అని అన్నారు. నిజాయితీకి మారుపేరైన పవన్ రాష్ట్ర ప్రజల దత్తపుత్రుడని అన్నారు. చెత్త పుత్రుడు జగన్ తన సైకో మనస్తత్వాన్ని అమరావతి విషయంలో మరోసారి రుజువు చేశారన్నారు.’మావిగన్’ అంటూ ఎన్నడూ వినని పిచ్చి మాటలు మాట్లాడుతుంటే వైసీపీ నాయకులు కూడా అర్థం కాక తలలు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నఅయిదేళ్లలో మావిగన్ గురించి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రాజధాని అనేది రాష్ట్రానికి ఆవు పట్టు లాంటిదని విషయాన్ని జగన్ గ్రహించాలన్నారు. అమరావతిని పక్కనపెట్టి మూడు రాజధానులు అంటూ అధోగతి పాలు చేశారని అన్నారు. అధికారంలో ఉండగా ప్రజలకు మేలు చేయలేక పోయారని అన్నారు. రూ.2,50,000 కోట్లు సంక్షేమం చేసి, రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారని మిగతా 7,50,000 కోట్లు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. అవినీతి పాలనతో తిరస్కారానికి గురైన వైసిపి తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందడానికి ప్రయత్నించాలన్నారు. పాదయాత్ర చేసినా,రోడ్లపై దొర్లుతూ దండాలు పెట్టినా వారి ఇష్టమని,ఏదైనా సంస్కారవంతంగా రాజకీయాలు చేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వం హామీలు పూర్తిస్థాయిలో నెరవేర్చినప్పటికీ వైసీపీ వాళ్లకు కనిపించడం లేదని అన్నారు. రైతులకు సకాలంలో పంట సొమ్ము చేతికందే విధంగా చేశామన్నారు. వచ్చేయడాది పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. అమరావతిలో అప్రతిహతంగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.వైసిపి హయాంలో జలజీవన్ మిషన్ పథకాన్ని బ్రష్టు పట్టించారని అన్నారు. కూటమి వచ్చాక నిధులు తీసుకువచ్చి ప్రతి గ్రామానికి రక్షిత మంచినీరు అందే విధంగా చర్యలు చేపట్టామన్నారు. గత ఐదేళ్లలో ధ్వంసమైన రోడ్లు డ్రైన్లను పూర్తిస్థాయిలో తిరిగి నిర్మించామన్నారు. రెండవ వేసవి నీటినిల్వ ట్యాంకును త్వరలో పూర్తి చేస్తామన్నారు. గత రెండు సంవత్సరాలనుండి భారీ ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ముందుకెళ్తున్నామని అన్నారు. ఇప్పటికైనా వాస్తవ దృక్పథంతో మాట్లాడాలన్నారు.అసత్య ప్రచారం చేస్తే ప్రజలు వైసిపిని నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు వాడపల్లి సుబ్బరాజు , మద్దిపాటి ధర్మేంద్ర,నీలపాల దినేష్ తదితరులు మాట్లాడారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *